బక్రీద్ సెలవుపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. మే 27కు బదులుగా మే 28న హాలిడే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులు, విద్యార్థులకు గుడ్న్యూస్ తెలిపింది. బక్రీద్ (ఈద్-ఉల్-అజ్హా) పండుగ సందర్భంగా ముందుగా ప్రకటించిన సెలవు తేదీలో మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తొలుత రాష్ట్ర ప్రభుత్వం మే 27, 2026న బక్రీద్ సాధారణ సెలవు ఉంటుందని వార్షిక క్యాలెండర్లో ప్రకటించింది. అయితే తాజా పరిస్థితులను పరిశీలించిన అనంతరం ఆ సెలవును మే 28కి మారుస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం బక్రీద్ వంటి పండుగలు చంద్ర దర్శనంపై ఆధారపడి ఉంటాయి. చంద్రుని కనిపించే తేదీని బట్టి పండుగ రోజు మారే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ స్టేట్ వక్ఫ్ బోర్డు నుంచి నివేదిక కోరింది. వక్ఫ్ బోర్డు సమర్పించిన నివేదిక ప్రకారం ఈ ఏడాది బక్రీద్ పండుగ మే 28న జరగనుందని స్పష్టం చేసింది. దీంతో ముస్లిం సమాజ భావోద్వేగాలను గౌరవిస్తూ ప్రభుత్వం సెలవు తేదీని కూడా మార్చాలని నిర్ణయించింది.
ఈ మేరకు ప్రభుత్వం జి.ఓ.ఆర్.టి నంబర్ 1006ను విడుదల చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం మే 27న ఉన్న సెలవును రద్దు చేసి, మే 28 (గురువారం)ను రాష్ట్రవ్యాప్తంగా సాధారణ సెలవుగా ప్రకటించింది. ఈ నిర్ణయం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ అనుబంధ సంస్థలు మరియు ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు వర్తించనుంది.
పండుగ రోజునే సెలవు ఉండటం వల్ల ఉద్యోగులు, విద్యార్థులు, ముఖ్యంగా ముస్లిం సోదరులకు ఇది పెద్ద ఊరటనిచ్చే నిర్ణయంగా భావిస్తున్నారు. బక్రీద్ ప్రార్థనలు, కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులతో సమావేశాలు, పండుగ కార్యక్రమాలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించుకునేందుకు ఈ మార్పు ఉపయోగపడనుంది.
ఇక ఇప్పటికే ప్రభుత్వం ఈ మార్పును అధికారిక గెజిట్లో కూడా నమోదు చేసింది. ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు కొత్త సెలవు తేదీని గమనించి తమ ప్రయాణాలు, ఇతర కార్యక్రమాలను ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పండుగ తేదీలు చంద్ర దర్శనాన్ని బట్టి మారడం సాధారణమే అయినప్పటికీ, ప్రభుత్వం వేగంగా స్పందించి పండుగ రోజునే సెలవు ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
