గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ప్రోత్సహించేలా ఎమ్మెల్యే గల్లా మాధవి చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిన వేళ.. విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంచేందుకు ఎమ్మెల్యే చేసిన ప్రయత్నం అందరి ప్రశంసలు అందుకుంటోంది.
మూడు నెలల క్రితం పదో తరగతిలో 550 మార్కులకు పైగా సాధించిన విద్యార్థులను విమానంలో ఢిల్లీ విహార యాత్రకు తీసుకెళ్తానని ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రకటించారు. తాజాగా ఆమె ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని ఎనిమిది మున్సిపల్ పాఠశాలల నుంచి 550కు పైగా మార్కులు సాధించిన 39 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. వారితో పాటు ఉపాధ్యాయులను కలిపి మొత్తం 52 మందిని మూడు రోజుల ఢిల్లీ పర్యటనకు తీసుకెళ్తున్నారు.
సాధారణంగా బస్సు ప్రయాణం కాకుండా విమానంలో తీసుకెళ్తామని ముందుగానే చెప్పడంతో విద్యార్థుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. ఫలితాలు వెలువడిన రోజు నుంచే ఈ టూర్ కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులను గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి తరలించనున్నారు. మూడు రోజుల పాటు దేశ రాజధానిలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశం కల్పిస్తున్నారు.
ఈ పర్యటనలో భాగంగా విద్యార్థులు ఉపరాష్ట్రపతిని కలిసేలా ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అలాగే కేంద్ర మంత్రి, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ విద్యార్థులు మరియు ఉపాధ్యాయులకు ప్రత్యేక విందు ఇవ్వనున్నారు.
విద్యార్థులు ఇంకా బాగా చదివి ఉన్నత లక్ష్యాలు సాధించాలని ప్రోత్సహించేందుకే ఈ టూర్ను ప్లాన్ చేసినట్లు ఎమ్మెల్యే దంపతులు తెలిపారు. ఈ పర్యటనలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు కూడా పాల్గొననున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఇలాంటి ప్రోత్సాహక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
