తిరుపతిలో వెలుగులోకి వచ్చిన పురాతన అమ్మవారి విగ్రహం.. భక్తులతో కిక్కిరిసిన ఇరంగారిపల్లి
తిరుపతి జిల్లా పాకాల మండలంలోని ఇరంగారిపల్లి గ్రామంలో పురాతన అమ్మవారి విగ్రహం వెలుగులోకి రావడం స్థానికంగా సంచలనంగా మారింది. రైతు పొలంలో జేసీబీతో తవ్వకాలు నిర్వహిస్తుండగా ఈ విగ్రహం బయటపడటంతో గ్రామస్తులు భక్తి భావంతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
గ్రామానికి చెందిన ఓ రైతు తన పొలాన్ని చదును చేయించేందుకు, అలాగే పొలం చుట్టూ కంచె నిర్మాణం చేపట్టేందుకు జేసీబీతో తవ్వకాలు చేయిస్తున్నాడు. ఈ క్రమంలో జేసీబీకి బండరాయిలా ఏదో గట్టిగా తగలడంతో పనులను వెంటనే నిలిపివేశారు. అనంతరం కార్మికులు, గ్రామస్తులు జాగ్రత్తగా మట్టిని తొలగించగా, సింహవాహనంపై ఆసీనులై ఉన్న అమ్మవారి విగ్రహం దర్శనమిచ్చింది.
విగ్రహం ఆకృతి, శిల్పకళను పరిశీలించిన స్థానికులు దీన్ని దుర్గాదేవి విగ్రహంగా భావిస్తున్నారు. విగ్రహం ఎక్కడైనా దెబ్బతినకుండా ఉండేందుకు గ్రామస్తులు ఎంతో అప్రమత్తంగా వ్యవహరించారు. తాళ్లు కట్టి జేసీబీ సహాయంతో విగ్రహాన్ని సురక్షితంగా బయటకు తీశారు.
ఆ తరువాత పొలంలోనే ప్రత్యేకంగా ఒక ప్రదేశం ఏర్పాటు చేసి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. “అమ్మవారు ప్రత్యక్షమయ్యారు” అనే నమ్మకంతో గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ విషయం చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించడంతో భక్తులు, ఆసక్తికరంగా చూసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.
కొంతమంది ఈ విగ్రహాన్ని పురాతన దేవాలయ ఆనవాళ్లలో భాగమని భావిస్తుండగా, మరికొందరు చారిత్రక ప్రాధాన్యత కలిగిన శిల్పంగా చెబుతున్నారు. దీంతో ఇరంగారిపల్లి గ్రామం ఒక్కసారిగా ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడుతోంది.
సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. పొలం యజమాని వివరాలు సేకరించడంతో పాటు, విగ్రహం పురాతనతపై సమాచారం తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అవసరమైతే పురావస్తు శాఖ అధికారులకు సమాచారం అందించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం గ్రామస్తులు ప్రతిరోజూ అమ్మవారికి నిత్యపూజలు నిర్వహిస్తూ భక్తిశ్రద్ధలతో దర్శించుకుంటున్నారు.
